చర్యలు తీసుకోవాల్సింది పోయి.. భజనపరులతో ఎదురుదాడి చేయిస్తారా?: కేసీఆర్ పై లక్ష్మణ్ విమర్శ

కరోనా వైరస్ కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ గవర్నర్ తమిళిసై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. గవర్నర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదారెడ్డి కౌంటర్ ఇవ్వడం వేడిని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.

కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే గవర్నర్ వ్యాఖ్యలతో తాము కూడా ఏకీభవిస్తున్నామని లక్ష్మణ్ చెప్పారు. గవర్నర్ వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సరైన చర్యలు తీసుకోవాల్సింది పోయి... భజనపరుల ద్వారా ఎదురు దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తీరు ప్రజాస్వామ్యానికి చేటు కలిగించేలా ఉందని చెప్పారు. కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు కూడా మొట్టికాయలు వేసిందని... ఈ విషయాన్ని కూడా గవర్నర్ ప్రస్తావించారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను గవర్నర్ లేవనెత్తారని... ప్రభుత్వ కళ్లు తెరిపించే ప్రయత్నం చేశారని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదారెడ్డితో కేసీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు.

KCR
TRS
Lakshman
BJP
Governor
Tamilisai Soundararajan

More Telugu News